Sajjala: వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి రాజధాని విషయంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కేవలం అక్కడ జరుగుతున్న అవకతవకలను, ప్రాధాన్యతలను మాత్రమే ప్రశ్నించారని ఆయన స్పష్టం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.
రైతులకు న్యాయం జరగలేదు మొదటి దశలో రాజధాని కోసం 50 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సజ్జల విమర్శించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల వద్దకు వెళ్లడానికి కనీసం రోడ్లు కూడా లేవని, అలాంటిది ఇప్పుడు మళ్లీ రెండో దశ కింద మరో 50 వేల ఎకరాల సేకరణ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మొదటి దశలో భూములిచ్చిన వారికి న్యాయం చేయకుండా ముందుకు వెళ్లడం తప్పు అని పేర్కొన్నారు.
భారీ ఖర్చు – భారీ స్కామ్ అమరావతి అభివృద్ధికి అప్పట్లోనే లక్ష కోట్లు అవసరమని లెక్కలు వేశారని, ఇప్పుడు అది రెండు లక్షల కోట్లకు చేరుతుందని సజ్జల అంచనా వేశారు. సచివాలయ భవనాల విస్తీర్ణం విషయంలో కూడా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశ పార్లమెంటు, తెలంగాణ అసెంబ్లీ కంటే కూడా అతి భారీ విస్తీర్ణంలో ఇక్కడ భవనాలు కడుతున్నారని, ఒక్కో చదరపు అడుగుకు 12 వేల రూపాయల వరకు ఖర్చు చేయడం వెనుక తన వారికి దోచిపెట్టే పన్నాగం ఉందని ఆయన ఆరోపించారు. అమరావతి అనేది “మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్” అని ఆయన అభివర్ణించారు.
వికేంద్రీకరణ అంటే అమరావతిని వదిలేయడం కాదు జగన్ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు కూడా అమరావతిని వదిలిపెట్టలేదని సజ్జల గుర్తు చేశారు. జగన్ స్వయంగా అమరావతిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారని, కానీ చంద్రబాబు పదేళ్ల తర్వాత ఇప్పుడే ఇల్లు కట్టడం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందే నగరం కాబట్టే దానిని గ్రోత్ ఇంజిన్గా జగన్ చూశారని, కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు విశాఖలో పనులు చేస్తూ జగన్ ఆలోచననే అమలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
టెండర్లలో గోల్మాల్ రాజధాని టెండర్ల ప్రక్రియలో కూడా పారదర్శకత లేదని, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీలకే మళ్లీ టెండర్లు కట్టబెడుతున్నారని సజ్జల విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి అడిగితే సమాధానం చెప్పని ప్రభుత్వం, కేవలం తమ అనుకూల వర్గాల ప్రయోజనాల కోసమే అమరావతిపై హడావుడి చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా అమరావతి రైతులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
