Anirudh Reddy: పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా దిగజారుడు వ్యాఖ్యలు మానుకుని తెలంగాణ స్థాయిని తెలుసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మనస్సు ఎంత గొప్పదో ఇప్పటికి పవన్ కళ్యాణ్కు అర్థమై ఉంటుందని అనుకుంటున్నానని అనిరుధ్ రెడ్డి తెలిపారు. తమపై ‘నర దిష్టి’ అన్న వ్యాఖ్యలు చేసినప్పటికీ, పవన్ కళ్యాణ్కు ఘనంగా స్వాగతం పలికి, అత్యంత గౌరవం ఇచ్చామని చెప్పారు.
ప్రోటోకాల్లో కూడా పవన్ కళ్యాణ్ పేరును ముందుగా ఉంచి, తమ మంత్రుల పేర్లను తరువాత పెట్టామని ఆయన వెల్లడించారు. అవసరం లేకున్నా ఆనం రామనారాయణ రెడ్డి పేరును కూడా చేర్చామని తెలిపారు.
అలాగే, టీటీడీకి లేదా ఏపీ దేవాదాయ శాఖకు సంబంధం లేకపోయినా, పవన్ కళ్యాణ్ పేరును గౌరవంగా ప్రస్తావించామని చెప్పారు. ఇది తెలంగాణ ప్రజల విశాల హృదయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మంచి మనసును గుర్తించాలని అనిరుధ్ రెడ్డి సూచించారు. తాము ఎప్పుడూ ఎవరి బాగు కోరే వారమే తప్ప, దిష్టి పెట్టే వాళ్లు కాదని స్పష్టం చేశారు.
