Namibia: ఆ ప్రాంతం ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశంలో అట్లాంటిక్ మహా సముద్ర తీరం. ఇసుక ఎడారి అది. అంతా ఇసుక దిబ్బెలతో కప్పబడి ఉన్న ప్రాంతం. వజ్రాల గనులకు ప్రసిద్ధి అయిన ఆ దేశంలో 2008వ సంవత్సరం నుంచి గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర తీరప్రాంతంలోని ఇక్కడి ఇసుక దిబ్బెలను తొలగించి భూగర్భంలో తవ్వకాలు చేపట్టారు. ఆశ్చర్యకరంగా, కండ్లు మిరిమిట్లు గొలిపేలా ఓ చెక్క పడవ శిథిలాలు వారికి గోచరించాయి. మరింతగా ఆ పడవను పరిశీలించగా ఆశ్చర్యకరమైన వస్తువులు కనిపించాయి. కానీ, ఆ పడవ ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు, ఎంతమంది వచ్చి ఉంటారు? అన్న విషయాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే సినీ క్లైమాక్స్ సన్నివేశం లాంటి సీన్ కండ్ల ముందే కదలాడినట్టైంది.
ఆ నౌకలో ఏముందో తెలుసా?
Namibia: పరిశోధనలో అది 1533వ సంవత్సరంలో అదృశ్యమైన బామ్ జీసస్ అనే పోర్చుగీసు దేశానికి చెందిన వాణిజ్య నౌక అని తేలింది. ఆ నౌకలోని చెక్కలను వరుసగా తొలగించి చూస్తూ కండ్లు చెదిరే నిధులు వారికి బయటపడ్డాయి. 2,000 బంగారు నాణేలె, లెక్కలేనన్ని వెండి నాణేలు, టన్నుల కొద్ది రాగి కడ్డీలు లభించాయి. శతాబ్దాలు గడిచినా వాటి మెరుపు చెక్కు చెదరలేదంటే అతిశయోక్తి కాదు. ఆసియా దేశాల్లో వాణిజ్యం కోసం వెళ్లినప్పుడు సేకరించిన అరుదైన ఏనుగు దంతాలు కూడా ఆ నౌకలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి.
Namibia: 1533వ సంవత్సరంలో ఆనాటి పోర్చుగల్ రాజు ఆదేశాల మేరకు మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేందుకు ఈ నౌక సుమారు 200 మంది వర్తక, వ్యాపారులతో భారతదేశం వైపు బయలుదేరిందని నిర్ధారించారు. దారిలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఆనాడు సంభవించిన పెను తుఫాన్లో ఆ నౌక చిక్కుకొని, బండరాళ్లను ఢీకొని ప్రమాదానికి గురై ఉంటుందని భావించారు. అయితే సముద్రమట్టం, గాలుల దిశ కాలక్రమంగా మారడంతో ఆ ప్రాంతం సముద్రంతో వేరుపడి ఎడారిగా మారింది. అప్పటి నుంచి అది ఇసుకలో కూరుకుపోయే ఉన్నది.
వర్తక వ్యాపారులపై వీడని మిస్టరీ
Namibia: ఇంతకీ ఆ నౌకలో ప్రయాణించిన 200 మంది వర్తక వ్యాపారులు ఏమై ఉంటారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. నౌక కనుమరుగు కావడం పోర్చుగల్ దేశంలో రికార్డు నమోదై ఉన్నది. కానీ, దానిలో ప్రయాణించిన వారు మాత్రం చేరుకున్నారా? లేదా? అన్న విషయాలు తేలలేదు. ఇప్పటికీ అంతుచిక్కని విషయంగానే ఉన్నది. నౌక లభించిన ప్రాంతంలో మాత్రం ఒక్క అస్తిపంజరం కూడా దొరకలేదు. అంటే వారు అక్కడ మరణించలేదని తేలింది. వారు చనిపోయి ఉంటే సముద్రంలో మరో ప్రాంతానికి కొట్టుకొని పోయి ఉంటారా? లేదా తీర ప్రాంతానికి చేరుకొని బతుకు జీవుడా అనుకుంటూ వెళ్లి ఉంటారా? అన్నది కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. కానీ 500 ఏళ్ల నాడు సాహసయాత్రకు వందలాది మంది బయలుదేరడం మాత్రం అత్యంత అరుదైన విషయంగానే చెప్పుకోవచ్చు.
