Robin Uthappa: టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టు ఎంపికపై చర్చ జోరందుకుంది. ముఖ్యంగా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ నెమ్మదించినప్పటికీ, సెలక్టర్లు అతనిపై నమ్మకం ఉంచడాన్ని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సమర్థించారు. ఈ సందర్భంగా ఉతప్ప టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉదాహరణను గుర్తు చేశారు.
2025లో సూర్యకుమార్ గణాంకాలు ఆశాజనకంగా లేవు. ఈ ఏడాది అతను కేవలం 13.63 సగటుతో 218 పరుగులు మాత్రమే చేశాడు, స్ట్రైక్ రేట్ కూడా 123.16 కి పడిపోయింది. అయితే, కేవలం గణాంకాలను చూసి సూర్య ఫామ్ను అంచనా వేయలేమని ఉతప్ప అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ, “2011 ప్రపంచకప్లో ధోనీ కూడా టోర్నీ ఆద్యంతం గొప్ప ఫామ్లో లేడు. ఫైనల్కు ముందు ఒకటి లేదా రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ ఫైనల్లో 91* పరుగులతో మ్యాచ్ విన్నర్గా నిలిచాడు” అని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: Woorkeri Raman: గిల్ను తప్పించడంలో అతని తప్పు ఏమీ లేదు
సూర్యకుమార్ బ్యాటింగ్ శైలిపై ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సూర్య అవుట్ ఆఫ్ ఫామ్ (ఫామ్ కోల్పోవడం) కాదు, కేవలం పరుగులు మాత్రమే రావడం లేదు. నెట్స్లో అతని బ్యాటింగ్ చూస్తుంటే.. మంచు కురుస్తున్న సమయంలో కూడా ఫుల్ లెంగ్త్ బంతులను థర్డ్ మ్యాన్ మీదుగా సిక్సర్లు కొడుతున్నాడు. ఫామ్లో లేని ఆటగాడు అలాంటి షాట్లు ఆడలేడు” అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో శుభ్మన్ గిల్, ఒల్లీ పోప్ వంటి వారు ఫామ్ సమస్య ఎదుర్కొంటున్నారని, కానీ సూర్య విషయంలో అది కేవలం సమయం మాత్రమేనని పేర్కొన్నారు.
