Mp Chamala: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు, నిజాలపై చర్చకు రావాలని ఆహ్వానించినా, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు మాటలు దాటవేస్తున్నారని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనికి పత్రికా సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఎంపీ చామల తెలిపారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలుగా మారవని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ద్రోహి ఎవరో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజూ సరైన పాలన అందించలేదని, అందుకే ప్రజలు ప్రజా పాలనకు ఓటేశారని తెలిపారు. గతంలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన మాటలనే ఇప్పుడు మళ్లీ చెబుతున్నారని కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు.
