Kandula Durgesh: తెలుగు సంస్కృతి, కళలకు వేదికగా అమరావతి మరోసారి సందడి చేయనుంది. తెలుగు సినిమా, సాహిత్యం, సంగీతం, నృత్య రంగాలకు అంకితంగా ‘ఆవకాయ్ ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆయన అమరావతిలో అధికారికంగా ఆవిష్కరించారు.
మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడుతూ, జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో విభిన్న కార్యక్రమాలను ఈ వేడుకల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలుగు కళల వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read: Ourangajeb: ఉద్యోగాల కల్పన మా ప్రభుత్వ బాధ్యత కాదు
ఈ కార్యక్రమాలకు కృష్ణానది తీరం పున్నమి ఘాట్, భవానీ ద్వీపం ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కళాకారులు, సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు పాల్గొనేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇదే సందర్భంలో మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులతో పాటు నంది నాటకోత్సవాలను కూడా నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమతో పాటు నాటక రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు.
సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకులకు అందుబాటులో టికెట్ ధరలు ఉండేలా నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. మొత్తంగా అమరావతిలో జరగనున్న ‘ఆవకాయ్ ఉత్సవాలు’ తెలుగు కళా సంస్కృతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఆయన తెలిపారు.
