Jupelli krishna rao: తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలూ కలిసి పనిచేశాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలవలేకపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనకు రెఫరెండమని స్వయంగా కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జూపల్లి, “ఆ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలింది” అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటకు రావడం పాలమూరు ప్రాజెక్టు కోసం కాదని, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికేనని విమర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదని ఆయన మండిపడ్డారు. 2023 ఎన్నికల సమయంలో ఒక మోటార్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు ప్రచారం చేశారని, కానీ అవసరమైన నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండానే ఆ పనులు చేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు ఉంటేనే రాష్ట్రానికి హక్కైన నీటిని వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
