Fire Accident: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా ఉపయోగిస్తున్న ఓ భారీ మొబైల్ క్రేన్ ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైల్వే ట్రాక్ సమీపంలో వంతెన నిర్మాణానికి వినియోగిస్తున్న ఈ భారీ క్రేన్ ఇంజన్ ఆఫ్ స్థితిలో ఉన్నప్పటికీ ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. క్రేన్లో ఉన్న ఆయిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ ఎగసింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయానికి గురయ్యారు.
Also Read: Palnadu Double Murder: పల్నాడు దుర్గి మండలం అడిగొప్పలలో దారుణం.. అన్నదమ్ముల హత్య.!
అదృష్టవశాత్తూ ఘటన సమయంలో అక్కడ పనులు సాగకపోవడంతో కార్మికులు ఎవరూ లేరు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటల్లో క్రేన్ ఇంజన్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ నాగభూషణం వెంటనే సంఘటనా స్థలానికి పోలీసు సిబ్బందిని పంపించారు. భద్రత దృష్ట్యా స్థానికులను అక్కడి నుంచి దూరంగా తరలించి అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.
అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే ట్రాక్కు అతి సమీపంలో ఈ ఘటన జరిగినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
