Phone Tapping Case

Phone Tapping Case: ఫోన్ టాంపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. ప్రభాకర్ రావు విచారణలో కీలక మలుపులు!

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. నేడు ఆయనను బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి తరలించి, లోతైన ప్రశ్నలు అడగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ జరిగింది? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విచారణలో మరో కీలకమైన అడుగు పడనుంది. ఇప్పటికే జైలులో ఉన్న ప్రణీత్ రావును, ప్రభాకర్ రావును ముఖాముఖి కూర్చోబెట్టి ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్లను ట్యాప్ చేయమని ప్రభాకర్ రావు ఏ రకమైన ఆదేశాలు ఇచ్చారు? వాటిని ప్రణీత్ రావు ఎలా అమలు చేశారు? అనే అంశాలపై అధికారులు స్పష్టత కోరుతున్నారు. ఇద్దరి సమాధానాల్లో తేడాలు ఉంటే, అసలు నిజాలను బయటకు రప్పించడం సులభం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తులో భాగంగా గతంలో నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సిట్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుల నుంచి సేకరించిన సమాచారాన్ని, ప్రభాకర్ రావు చెబుతున్న విషయాలతో పోల్చి చూస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాకర్ రావును 12 సార్లు విచారించిన అధికారులు, ఈసారి మాత్రం ఆయన నుంచి కీలకమైన వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులు (FSL), ఫోన్ కాల్ డేటా వంటి పక్కా ఆధారాలతో నిందితులను గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసు మొదలైనప్పటి నుండి బాధితుల నుంచి సేకరించిన వివరాలు, సాంకేతిక ఆధారాలు దర్యాప్తుకు ఎంతో కీలకంగా మారాయి. సిట్ దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొంత మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *