Bandi Sanjay

Bandi Sanjay: ఏపీ అభివృద్ధి బాటలో ఉంది.. తెలంగాణలోనూ బీజేపీ జెండా ఎగురవేస్తాం

Bandi Sanjay: విశాఖపట్నం వేదికగా జరిగిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి సాగిస్తున్న ‘డబుల్ ఇంజన్’ పాలన అద్భుతంగా ఉందని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రతి జిల్లాలో వాజపేయి విగ్రహాలను ఏర్పాటు చేయడం దేశానికే ఆదర్శమని ప్రశంసించారు.

విశాఖపట్నం పర్యటన తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. విశాఖను పోరాటాల గడ్డగా, పరిశ్రమలకు ముఖద్వారంగా ఆయన అభివర్ణించారు. అటల్ బిహారీ వాజపేయి వంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఒక వర్గానికో, పార్టీకో పరిమితం కాకుండా యావత్ భారతావని వాజపేయి వెంటే నడిచిందని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.

ఇక తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలు ఆ పార్టీ తీరుతో విసిగిపోయారని అన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ పాలనపై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని, ప్రజలు ఆయన్ని మర్చిపోయారని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా ప్రధాని మోడీ పంపిస్తున్న నిధులతోనే సాధ్యమవుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతోందని, కేవలం మూడు రాష్ట్రాలకే ఆ పార్టీ పరిమితమైందని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్‌ను ఎలాగైతే ప్రజలు తుడిచిపెట్టేశారో, తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని, వాజపేయి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ కూడా సుపరిపాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *