Nara lokesh: మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో విశాఖపట్నం చేరుకోనుంది. భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు వైజాగ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ భారత జట్టుకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ చేశారు.
భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య టీ20 సిరీస్ ఈ నెల డిసెంబర్ 21 నుంచి 30 వరకు జరగనుంది. ఇందులో తొలి రెండు మ్యాచ్లు డిసెంబర్ 21, 23 తేదీల్లో విశాఖలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో ఈ మ్యాచ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తన ట్వీట్లో, “ఛాంపియన్లకు స్వాగతం. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ ప్రయాణం మన విశాఖలో జరిగిన నెల రోజుల క్యాంపుతోనే ప్రారంభమైంది. ఇప్పుడు విశ్వవిజేతలుగా నిలిచిన తర్వాత తమ తొలి మ్యాచ్లను కూడా ఇక్కడే ఆడుతున్నారు” అని పేర్కొన్నారు
కొద్ది రోజుల క్రితం “వైజాగ్కు వరల్డ్ ఛాంపియన్లు వస్తున్నారు… ఎవరో చెప్పుకోండి” అంటూ నారా లోకేశ్ చేసిన ట్వీట్ అప్పట్లో ఆసక్తి రేపింది. ఇప్పుడు ఆ ట్వీట్కు సమాధానంగా భారత మహిళల క్రికెట్ జట్టే విశాఖకు వస్తోందని స్పష్టమైంది
ప్రపంచకప్ విజయం తర్వాత తొలి సిరీస్ కావడంతో పాటు, కీలక మ్యాచ్లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
