Chandrayangutta: హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల ప్రకారం, చాంద్రాయణగుట్టకు చెందిన ఓ యువతి భర్త ఉండగానే మరో వ్యక్తిని ప్రేమించి రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో ఆమెకు షేక్ మొహమ్మద్ అజహర్ (10) అనే కుమారుడు ఉన్నాడు. రెండో పెళ్లి తర్వాత బాలుడు తల్లి, రెండో భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.
Also Read: Fire Accident: విజయనగరం గొలుగువలసలో అగ్నిప్రమాదం.. వృద్ధురాలు మృతిసజీవదహనం
ఇటీవల అజహర్ ఇరుగు పొరుగు పిల్లలతో గొడవపడిన విషయం ఇంట్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుగు పొరుగు వారు బాలుడి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేయడంతో సవతి తండ్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపావేశంలో ఈ నెల 7వ తేదీన బాలుడిని రోడ్డుపైకి ఎత్తేసి తల పగల కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన అజహర్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం అలుముకోగా, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
