Indigo: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల తమ విమాన సర్వీసుల్లో చోటుచేసుకున్న కార్యాచరణ అంతరాయాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు కోసం సంస్థ ఓ స్వతంత్ర అంతర్జాతీయ ఏవియేషన్ కన్సల్టెన్సీని నియమించింది. శుక్రవారం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ విచారణను ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్సి’ నిర్వహించనుంది. గ్లోబల్ ఏవియేషన్ రంగంలో విశాలమైన అనుభవం కలిగిన ఏవియేషన్ నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ ఈ దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఆయనకు ఎఫ్ఏఏ, ఐసీఏఓ, ఐఏటీఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో పని చేసిన నలభై ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
ఇండిగో ఇటీవల ఎదుర్కొన్న విమాన అంతరాయాల మూల కారణాలను పూర్తిగా విశ్లేషించి, సమస్యల పై స్పష్టమైన అంచనాలు ఇవ్వడానికి ఈ నియామకం చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు ఇండిగో బోర్డు కూడా ఆమోదం తెలిపింది. అంతకుముందు సంస్థ ఏర్పాటు చేసిన క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ స్వతంత్ర నిపుణుడితో దర్యాప్తు జరపాలని బోర్డుకు సిఫార్సు చేసింది.
దర్యాప్తు పూర్తయిన తర్వాత కెప్టెన్ ఇల్సన్ బృందం ఒక సమగ్ర నివేదికను ఇండిగో బోర్డుకు సమర్పించనుంది. తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంస్థ పూర్తిగా కట్టుబడి ఉందని ఇండిగో స్పష్టం చేసింది.
ఈ దర్యాప్తు ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఇండిగో షేరు ధర ₹43 (0.89%) మేర లాభపడి ₹4,862 వద్ద ముగిసింది.
