Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో ఈ రోజు ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మలుపు వద్ద నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చింతూరు పోలీసులు, సహాయ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను మొదలుపెట్టాయి. గాయపడిన వారిని చింతూరు, రంపచోడవరం ఏరియా ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
విగ్నేశ్వర ట్రావెల్స్ బస్సే ప్రమాదానికి కారణం
ప్రమాదం జరిగిన వాహనం శ్రీవిఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన బస్సు అని గుర్తించారు. బస్సు నెంబర్ AP39 UM 6543. కోటప్పకొండ నుంచి బయలుదేరిన ఈ బస్సు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు సహా 37 మంది ప్రయాణికులు ఉన్నారని పోలిసులు తెలిపారు.
మృతులంతా చిత్తూరు జిల్లాకు చెందినవారని అధికారులు నిర్ధారించారు. రాజుగారి మెట్టు ప్రాంతంలోని గట్టి మలుపు వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు ప్రాథమిక సమాచారం.
Also Read: SA vs IND 2nd T20: భారత్పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్ సమం!
ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.అధికారులతో మాట్లాడి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించాలనే ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అందరికీ తగిన వైద్యం అందించాలని సంబంధిత శాఖలు కలిసి పనిచేయాలి అని సీఎం తెలిపారు.
మంత్రి నారా లోకేష్ స్పందన
ప్రమాదంపై మంత్రి లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
