Alluri Bus Accident: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ రోజు ఉదయం భారీ విషాదం చోటుచేసుకుంది. చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్ట సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు సమాచారం. చిత్తూరు జిల్లా నుండి వచ్చిన ఈ యాత్రికులు భద్రాచలం దర్శనం పూర్తిచేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లోయలో పడి పోవడంతో చాలా మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Hyderabad: హైదరాబాద్లో కార్లు దగ్ధం.. రహ్మత్నగర్ ఎస్పీఆర్ హిల్స్లో కలకలం!
ప్రస్తుతం అందిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది, అయితే గాయాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండటంతో సహాయక బృందాలు వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ముందుకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారమిచ్చారు. క్షతగాత్రులను అత్యవసరంగా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
