Pawan Kalyan Controversy: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ‘కోనసీమ దిష్టి’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద అలజడి సృష్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చాలా గట్టిగా హెచ్చరించారు.
కోమటిరెడ్డి గట్టి హెచ్చరిక
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే, ఆయన నటించిన ఒక్క సినిమా కూడా తెలంగాణలో ఆడదు” అని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాదు, “సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నాను, క్షమాపణ చెప్పకపోతే మీ సినిమా ఒక్క థియేటర్లో కూడా విడుదల కాదు” అని స్పష్టం చేశారు.
‘తెలంగాణ ప్రజల దిష్టి కాదు, ఆంధ్రా పాలకుల సమస్య’
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మరొక ముఖ్యమైన విషయం చెప్పారు. “తెలంగాణ ప్రజలకు దిష్టి ఏమీ లేదు. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషాన్ని తాగాల్సి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరగా, “చిరంజీవిగారు మంచివారు, సూపర్ స్టార్. కానీ, పవన్ కల్యాణ్కు రాజకీయ అనుభవం లేదు అనుకుంటా. అందుకే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు” అని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

