Amaravati: వైసీపీ ప్రభుత్వ కాలంలో ఉద్యోగం కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్కు తిరిగి ఉద్యోగంలో చేరే అవకాశం లభించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ను మళ్లీ సేవలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఈరోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వులు అందుకున్న ప్రకాశ్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ను కలిసి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఉన్నతాధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత జగన్ ప్రభుత్వ హయాంలో పోలీసులు పొందాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రకాశ్ ధర్నా చేశారు. ఈ చర్యను క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన అప్పటి ఉన్నతాధికారులు ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు.
ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రకాశ్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రకాశ్కు న్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

